ఇండియా – బంగ్లాదేశ్ టీ20 సిరీస్ పై ప్రకృతి కన్నెర్ర
ఇండియా–బంగ్లాదేశ్ టీ20 సిరీస్పై ప్రకృతి కన్నెర్ర చేసినట్టుంది. తొలి టీ20కి ఢిల్లీ కాలుష్యం కలవరపెట్టగా.. రాజ్కోట్ వేదికగా గురువారం జరుగనున్న రెండో టీ20 నిర్వహణకు తుఫాన్ ఇబ్బందిగా మారేలా కనిపిస్తోంది. ప్రమాదస్థాయికి చేరిన కాలుష్యంలోనైనా తొలి టీ20 సజావుగానే సాగింది. కానీ రాజ్కోట్ వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రెండో టీ20 జరగడం అనుమానంగా మారింది. గతవారం ఇండియా పశ్చిమ తీరం వైపు పయనించిన తుఫాన్ అనూహ్యంగా గుజరాత్ వైపు మళ్లింది. దీంతో దియు, పోర్బందర్ తీరం వెంబడి ఈనెల 7 వరకు సుమారు గంటకు 80–100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ గాలుల నేపథ్యంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఇప్పటికే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దనే హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రముఖ వ్యాఖ్యాత హర్షాబోగ్లే ట్వీట్ చేశాడు. ‘ఇప్పుడు రాజ్కోట్ మ్యాచ్ వంతు. ఇక్కడ తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ తుఫాన్తో ప్రజలకు ఎలాంటి అపాయం కలగదని భావిస్తున్నా. ఈ ఏడాదైతే వాతావరణం ఏమాత్రం ఊహించలేకుండా ఉంది’అని చెప్పాడు.