హైదరాబాద్ శుభారంభం ముస్తాక్ అలీ ట్రోఫీ
చండీగఢ్: టాపార్డర్ రాణించడంతో దేశవాళీ టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ సిలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో అంబటి రాయుడు సేన పంజాబ్పై 2 పరుగుల తేడా(వీజేడీ పద్ధతి)తో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (42), రాయుడు (34), అక్షత్ రెడ్డి (47) సత్తాచాటారు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో వీజేడీ పద్ధతి ప్రకారం పంజాబ్ లక్ష్యాన్ని 14 ఓవర్లలో 100 పరుగులుగా నిర్ణయించారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ (48) ఆకట్టుకున్నా.. చివరకు పంజాబ్ 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 97 పరుగులే చేసింది.